లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్కు బ్యాకప్గా టామ్ బాంటన్ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది.
టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఆడాడు.