ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్‌ కట్టుకొని కోహ్లి స్థానంలో

28 Aug, 2021 08:27 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ అభిమాని జార్వో చేసిన పని గుర్తుండే ఉంటుంది.  లార్డ్స్‌ టెస్టులో ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో టీమిండియా జెర్సీ వేసుకొని ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని బయటికి తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది.

చదవండి: గేల్‌ సిక్స్‌ కొడితే మాములుగా ఉంటుందా.. గ్లాస్‌ పగిలిపోయింది

ఆ ఘటన మరువక ముందే జార్వో మరోసారి హైలెట్‌ అయ్యాడు. విషయంలోకి వెళితే..  టీ విరామం తర్వాత 47వ ఓవర్‌లో 59 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ ఓలీ రాబిన్స్‌న్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ కాల్‌పై టీమిండియా రివ్యూ కోరింది.  ఇదే సమయంలో కోహ్లి నెంబర్‌ 4 స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డీఆర్‌ఎస్‌ నిర్ణయం కోసం కాస్త సమయం ఉండడంతో జార్వో తన పనిని కానిచ్చేశాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని కోహ్లి స్థానంలో నెం. 4 బ్యాట్స్‌మన్‌లా క్రీజులోకి వచ్చేశాడు.  అయితే మొదట కోహ్లి వచ్చాడనే భావించిన సెక్యూరిటీ.. తర్వాత  విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు జార్వోనూ బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అందరికీ నవ్వులు పూయిస్తునప్పటికీ ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  రెండుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే మరేవరైనా వస్త ఆటగాళ్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని  అభిమానులు నిలదీస్తున్నారు 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తేరుకున్నట్లే కనిపిస్తుంది. 345 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పుజారా 91 నాటౌట్‌, కోహ్లి 45 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రోహిత్‌ శర్మ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్‌ ఈ టెస్టులో నిలవాలంటే నాలుగోరోజు మొత్తం ఆడాల్సి ఉంటుంది. మరో 139 పరుగులు వెనుకబడిఉన్న భారత్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగులకే చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సిరీస్‌ ఇదే

మరిన్ని వార్తలు