Mohammed Siraj: సిరాజ్‌ స్కోరెంత.. ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌

26 Aug, 2021 13:40 IST|Sakshi

లీడ్స్‌: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో​ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లార్డ్స్‌ టెస్టులో సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వతహాగా దూకుడుగా కనిపించే సిరాజ్‌కు కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా టార్గెట్‌ చేస్తే వారికి ధీటుగా బదులిస్తుంటాడు.

చదవండి: ENG Vs IND 3rd Test: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు

తాజాగా ఇంగ్లండ్‌తో లీడ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సిరాజ్‌ను టార్గెట్‌ చేస్తే ఇంగ్లండ్‌ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆలౌట్‌ అయిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ మొదటి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ గేలి చేసే ప్రయత్నం చేశారు.  బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌‌ని ఉద్దేశించి స్టాండ్స్‌లోని అభిమానులు ‘‘సిరాజ్ స్కోర్ ఎంత..?’’ అంటూ వెటకారంగా అడిగారు. అయితే.. సిరాజ్‌ వారికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. అభిమానుల వైపు చూస్తూ ‘‘1-0’’ అని సిగ్నల్ ఇచ్చాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, అండర్సన్‌ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్‌ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్‌ (52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హమీద్‌ (60 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్‌ పోయింది: వాన్‌

మరిన్ని వార్తలు