England Vs Newzealand: తొలి టెస్ట్‌ డ్రా

7 Jun, 2021 15:17 IST|Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ను ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు డ్రాగా ముగించుకోగలిగింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచి అంతగా ప్రభావం చూపించని ఇంగ్లండ్‌ జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. కివీస్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ డామినిక్‌ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్‌ జో రూట్‌ (40) పర్వాలేదనిపించాడు. రోరి బర్న్స్‌ (25), జాక్‌ క్రాలీ (2) ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో సిబ్లేకు ఓలీ పోప్‌ (20) తోడుగా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో వాగ్నర్‌కు రెండు, సౌథీకి ఓ వికెట్‌ దక్కింది. 

అంతకుముందు 62/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. న్యూజిలాండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ లాథమ్‌(36), రాస్‌ టేలర్‌(33) ఓ మోస్తరుగా రాణించగా, ఓలీ రాబిన్సన్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, అరంగేట్రం ఆటగాడు డెవాన్‌ కాన్వే ద్విశతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  378 పరుగులు చేయగా, రోరీ బర్న్స్(132) శతకొట్టడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో రాణించిన డెవాన్‌ కాన్వేను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.
చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ భార్య..

మరిన్ని వార్తలు