మాంచెస్టర్: ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అనూహ్య పరిణామానికి అవాక్కైన ఆమె.. ఆశ్చర్యం నుంచి తేరుకుని అతడి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రియుడు ఇచ్చిన ఉంగరం స్వీకరించి కన్నీటి పర్యంతమైంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో వీరి ప్రేమను హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఘటన గురించి కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘హేయ్... ఇక్కడ ఏం జరుగుతోంది? జిల్, ఫిల్.. అంతేకదా జిల్.. ఫిల్. 22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు.
డెసిషన్ పెండింగ్లో ఉంది.. ఓహో.. ఆమె యెస్ చెప్పేసింది’’ అంటూ ప్రేమజంట పేర్లను వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారికి ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా మ్యాచ్ 9వ ఓవర్ చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇక చివరిదైన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. జాసన్ రాయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
స్కోర్లు: పాకిస్తాన్- 154/6 (20)
ఇంగ్లండ్- 155/7 (19.4)
Decision Pending... ⏳
She said YES! 💍
Congrats Phil and Jill! ❤️ pic.twitter.com/SHj0iy45Pw
— England Cricket (@englandcricket) July 21, 2021