Eng Vs Pak T20 Series: పాక్‌తో సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా మొయిన్‌ అలీ.. కారణం ఇదే!

31 Aug, 2022 16:47 IST|Sakshi
మొయిన్‌ అలీ(PC: ECB)

England Tour Of Pakistan 2022: పాకిస్తాన్‌ పర్యటనకు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ గాయం కారణంగా ఈ టూర్‌కు దూరమయ్యాడు. హండ్రెడ్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు పిక్కల్లో గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో పాక్‌ పర్యటనకు కూడా దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ మొయిన్‌ అలీ.. బట్లర్‌ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ విరామం త​ర్వాత ఇంగ్లండ్‌ పాక్‌లో పర్యటించనుంది.

టెస్టు సిరీస్‌ సైతం..
2005 తర్వాత సెప్టెంబరులో తొలిసారిగా పాక్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 2 వరకు టీ20 సిరీస్‌ ఆడనుంది. మొదటి ఆరు మ్యాచ్‌లు కరాచీ వేదికగా జరుగనుండగా.. ఆఖరి టీ20కి లాహోర్‌ వేదిక కానుంది. ఈ టూర్‌ ముగిసిన తర్వాత డిసెంబరులో మరోసారి టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ మరోసారి పాక్‌ పర్యటనకు వెళ్లనుంది.

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడనుంది. రావల్పిండి, ముల్తాన్‌, కరాచీలలో డిసెంబరు 1 నుంచి 21 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ జరుగనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ జాకిర్‌ ఖాన్‌ ధ్రువీకరించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో మొయిన్‌ అలీ మూడో స్థానంలో నిలిచాడు.

చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు!
Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన హార్దిక్‌.. కెరీర్‌ బెస్ట్‌... ఏకంగా..

మరిన్ని వార్తలు