IND VS ENG 5th Test: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ

30 Jun, 2022 18:32 IST|Sakshi

England Squad For Test VS India: టీమిండియాతో రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు ఖరారైంది. ఒక్క మార్పు మినహా తాజాగా న్యూజిలాండ్‌పై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) రంగంలోకి దించుతుంది.  జేమీ ఓవర్టన్‌ స్థానంలో వెటరన్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

ఓపెనర్లుగా అలెక్స్‌ లీస్‌, జాక్‌ క్రాలే.. వన్‌డౌన్‌లో ఓలీ పోప్‌.. జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ వరుసగా 4, 5, 6 స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. మూడో టెస్ట్‌ సందర్భంగా కరోనా బారిన పడిన బెన్‌ ఫోక్స్‌ స్థానంలో సామ్‌ బిల్లింగ్స్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. పేసర్లుగా మ్యాథ్యూ పాట్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆండర్సన్‌.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా జాక్‌ లీచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 

మరోవైపు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవెన్‌పై సందిగ్ధత కొనసాగుతుంది. కరోనా బారిన పడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హెల్త్‌పై ఇంతవరకు అధికారిక అప్‌డేట్‌ లేదు. దీంతో ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే విషయంపై గందరగోళం నెలకొంది. తుది జట్టు విషయంలో టీమిండియా గోప్యత పాటిస్తుంది. 

కాగా, కరోనా కారణంగా గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. 
చదవండి: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్‌ అలీ

మరిన్ని వార్తలు