PAK Vs ENG: మలాన్‌, బ్రూక్‌ల విధ్వంసం.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌

3 Oct, 2022 08:25 IST|Sakshi

పాకిస్తాన్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ చేజెక్కించుకుంది. ఆదివారం పాక్‌తో జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్‌ 67 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో డేవిడ్‌ మలాన్‌, హ్యారీ బ్రూక్‌లు విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్‌ మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు భారీ స్కోరు చేసింది. డేవిడ్‌ మలాన్‌(47 బంతుల్లో 78 నాటౌట్‌, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ (29 బంతుల్లో 46 నాటౌట్‌, 1 ఫోర్‌, 4 సిక్సర్లు), బెన్‌ డకెట్‌ 30 పరుగులు చేశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజం విఫలం కావడం పాక్‌ను దెబ్బతీసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షాన్‌ మసూద్‌ 56 పరుగులతో ఆకట్టుకున్నప్పటికి అతనికి సహకరించేవారు కరువయ్యారు. కుష్‌దిల్‌ షా 27 పరుగులు చేశాడు. ఓవారాల్‌గా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించిన డేవిల్‌ మలాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రాగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా హ్యారీ బ్రూక్‌ నిలిచాడు.

ఇక ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి ఆరు మ్యాచ్‌ల్లో చెరో మూడు గెలిచి 3-3తో సమానంగా ఉన్న దశలో ఆఖరి టి20లో​ చెలరేగిన ఇంగ్లండ్‌ విజయంతో పాటు 4-3తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్‌కు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడింది. ఇక టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు