Adam Lyth: సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్‌ క్రికెటర్‌

13 Aug, 2022 13:30 IST|Sakshi

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఆడమ్‌ లిత్‌కు ఈసీబీ షాక్‌ ఇచ్చింది. ఇకపై ఈసీబీ పరిధిలో జరిగే ఏ మ్యాచ్‌లోనూ ఆడమ్‌ లిత్‌ బౌలింగ్‌ వేయకుండా అతనిపై నిషేధం విధించింది. అతని బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది.

జూలై 16న విటాలీటి బ్లాస్ట్‌లో భాగంగా లంకాషైర్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆడమ్ లిత్‌ ఒకే ఓవర్‌ బౌలింగ్‌ చేసి 15 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా ఉన్న డేవిడ్‌ మిల్న్స్‌, నీల్‌ మాలెండర్‌లు ఆడమ్‌ లిత్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అభ్యంతరం చెప్పారు. లిత్ యొక్క బౌలింగ్‌ యాంగిల్‌లో చేయి 15-డిగ్రీల థ్రెషోల్డ్ మార్క్‌ను అధిగమించినట్లుగా కనిపించిదని పేర్కొన్నారు.అంపైర్ల ఫిర్యాదుతో లాఫ్‌బరో యునివర్సిటీలోని గ్రౌండ్‌లో ఆడమ్‌ లిత్‌ బౌలింగ్‌పై ఈసీబీ అధికారులు అసెస్‌మెంట్‌ నిర్వహించారు.

బౌలింగ్‌ యాక్షన్‌ కాస్త తేడాతా అనిపించడంతో ఈసీబీ రెగ్యులేషన్‌ టీంకు పంపించారు. వారి నివేదిక వచ్చిన అనంతరం.. మరోసారి బౌలింగ్‌ రీ-అసెస్‌మెంట్‌ నిర్వహించే వరకు ఆడమ్‌ లిత్‌ బౌలింగపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఆడమ్‌ లిత్‌ బౌలింగ్‌ వేయకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఆడమ్‌ లిత్‌ హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో నార్తన్‌ సూపర్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రస్తుతం టోర్నీలో మూడు మ్యాచ్‌లు కలిపి 132 పరుగులు చేసిన ఆడమ్‌ లిత్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగతున్నాడు. ఇక అంతకముందు యార్క్‌షైర్‌ తరపున కౌంటీ సీజన్‌లో పాల్గొన్న ఆడమ్‌ లిత్‌ 10 మ్యాచ్‌లు కలిపి 608 పరుగులు చేశాడు. అంంతేకాదు విటాలిటీ బ్లాస్ట్‌ 2022 టోర్నమెంట్‌లోనూ ఆడమ్‌ లిత్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లాడి 177 స్ట్రైక్‌రేట్‌తో 525 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు టెస్టులు ఆడిన ఆడమ్‌ లిత్‌ 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది.

చదవండి: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం!

CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్‌ గ్రూప్‌.. బట్లర్‌ సహా..

మరిన్ని వార్తలు