'ఐపీఎల్‌ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం'

12 Mar, 2021 14:13 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌ వన్డే, టీ20 కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ వల్ల మాకు లాభమే కలిగింది కానీ ఏనాడు నష్టం జరగలేదని తెలిపాడు. ఐపీఎల్‌ వల్ల కలిగిన అనుభవాన్ని తాము డబ్బుతో వెలకట్టలేమని మోర్గాన్‌ స్పష్టం చేశాడు. టీమిండియాతో కొన్ని గంటల వ్యవధిలో తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభం కానున్న సమయంలో మో​ర్గాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది.

''ఒక రకంగా మేము ఐపీఎల్‌కు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. 2019 ప్రపంచకప్‌ సాధించడం మొదలు.. టీ20ల్లో నంబర్‌వన్‌గా నిలబడ్డామంటే దానికి ఐపీఎల్‌ లాంటి లీగ్‌లే కారణమని చెప్పొచ్చు. రానున్న రెండు టీ20 ప్రపంచకప్‌ దృష్టిలో పెట్టుకొని మేము ఐపీఎల్‌ ఆడడం వల్ల మాకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పడనుంది.మా ఆటగాళ్లు ఐపీఎల్‌లో కంటిన్యూ అవడం వల్ల బ్యాటింగ్‌ ఎలా చేయాలనే దానిపై క్లారిటీతో పాటు ఆత్మవిశ్వాసాన్ని మెండుగా సంపాదించినట్లవుతుంది. అందుకే ఐపీఎల్‌ను దేనితో వెలకట్టలేం. డబ్బులు మాకు మొదటి ప్రాధాన్యం కాదు.. ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవాలంటే ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.''అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఇయాన్‌ మోర్గాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 66 మ్యాచ్‌లాడిన మోర్గాన్‌ 1272 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్‌ తరపున 242 వన్డేల్లో 7598 పరుగులు, 97 టీ20ల్లో 2278 పరుగులు, 16 టెస్టుల్లో 241 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న మొదలై.. మే 30న ముగియనుంది.
చదవండి: 
త్రో వేయడంలో కన్ఫ్యూజన్‌‌.. అసలు మజా అక్కడే

'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్‌ తినాలి'

మరిన్ని వార్తలు