ఐపీఎల్‌ కోసం దేశ బాధ్యతలను పణంగా పెట్టొద్దు.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

2 Jan, 2022 21:26 IST|Sakshi

Mike Atherton: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో దారుణంగా విఫలమవుతున్న ఇంగ్లండ్‌ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ ఐపీఎల్‌ను కార్నర్‌ చేసి ఇంగ్లీష్‌ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్‌లో ఆడడం కోసం కొందరు ఆటగాళ్లు దేశ బాధ్యతలను పణంగా పెడుతున్నారని విరుచుకుపడ్డాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ సహా ఇతర లీగ్‌ల్లో ఆడేందుకు ఇంగ్లీష్‌ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కాకూడదని, ఇలా జరగకుండా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) చర్యలు తీసుకోవాలని ఆయన సూచించాడు.

జేసన్‌ రాయ్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌లు ఐపీఎల్‌ కారణంగానే గాయాలపాలై జాతీయ జట్టుకు దూరమాయ్యరని ప్రస్తావించాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా.. రొటేషన్‌ విధానంలో ఏదో ఒక టోర్నీలో ఆడే విధంగా ఈసీబీ షెడ్యూల్‌ ప్రిపేర్‌ చేయాలని ఓ కాలమ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఇంగ్లండ్‌ టెస్ట్‌ సారథ్య బాధ్యతల నుంచి రూట్‌ను తప్పించి బెన్‌స్టోక్స్‌కు అప్పగిస్తే సత్ఫలితాలు రాబట్టొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కోచ్‌ సిల్వర్‌వుడ్‌ను సైతం సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్‌ స్ట్రాటజీ వరకు కెప్టెన్‌, కోచ్‌లు దారుణంగా విఫలమవుతున్నారని మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్‌ల యాషెస్‌ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 
చదవండి: రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి

మరిన్ని వార్తలు