ఇంగ్లండ్‌ మహిళలకు నాలుగో విజయం 

30 Sep, 2020 03:15 IST|Sakshi

డెర్బీ: ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు విజయం దూరంలో ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 44 పరుగుల ఆధిక్యంతో గెలిచి సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు సాధించింది. అమీ జోన్స్‌ (37 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హీథర్‌నైట్‌ (30 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడారు. విండీస్‌ బౌలర్లలో ఆలియా అలెన్‌ రెండు వికెట్లు తీసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది. షెడిన్‌ నేషన్‌ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో కేథరిన్‌ బ్రంట్, సారా గ్లెన్‌ రెండేసి వికెట్లు తీశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌ నేడు జరుగుతుంది.    

మరిన్ని వార్తలు