ENG Vs PAK 1st T20: 'పాకిస్తాన్‌ కూడా ఓడిపోయింది'.. ఇంగ్లండ్‌ ఘన విజయం

21 Sep, 2022 09:12 IST|Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్‌ ఓటమితో ప్రారంభించింది. కరాచీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు) ఆసియా కప్‌ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

కెప్టెన్‌ బాబర్‌ ఆజం 31 పరుగులు చేసి ఔటవ్వగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ 28 పరుగులు చేశాడు. మిగతావారెవరు పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లూక్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్‌ రషీద్‌ 2, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ ఒక వికెట్‌ తీశాడు. కాగా ఇంగ్లండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో మొయిన్‌ అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.

అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌లో అలెక్స్‌ హేల్స్‌ 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన హారీ బ్రూక్‌ జట్టును గెలిపించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలలో ఉస్మాన్‌ ఖాదీర్‌ 2, షాహనవాజ్‌ దహనీ, హారిస్‌ రౌఫ్‌ చెరొక వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ సెప్టెంబర్‌ 22న(గురువారం) జరగనుంది.

ఇక పాకిస్తాన్‌ ఓడిపోవడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్స్‌ చేశారు. ''ఒకేరోజు రెండు ఉపఖండపు జట్లు పరాజయం చవిచూశాయి. ఒకటి టీమిండియా అయితే.. రెండో జట్టు పాకిస్తాన్‌''..'' ఈ రెండు జట్లు తాము ఆడుతున్న సిరీస్‌లో కొత్త జెర్సీలతో బరిలోకి దిగాయి. కొత్త జెర్సీ రెండు జట్లకు కలిసి రాలేదు''... ''ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతే.. పాకిస్తాన్‌ కూడా ఓడిపోయింది ఇంగ్లండ్‌ చేతిలో'' అంటూ పేర్కొన్నారు.

చదవండి: దినేశ్‌ కార్తిక్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు