ఇషా గురికి రెండో స్వర్ణం

7 Mar, 2022 05:31 IST|Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, రాహీ సర్నోబత్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు 17–13తో సింగపూర్‌ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఆదివారమే జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో అఖిల్‌ షెరాన్‌–శ్రియాంక జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. అఖిల్‌–శ్రియాంక జంట 16–10తో రెబెకా–రుంప్లెర్‌ (ఆస్ట్రియా) ద్వయంపై గెలిచింది.

మరిన్ని వార్తలు