ఈ సీజన్‌లో అత్యధిక టీవీ రేటింగ్స్‌ : గంగూలీ

31 Aug, 2020 20:33 IST|Sakshi

అబుదాబి : యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌-2020 సీజన్‌కు అత్యధిక టీవీ రేటింగ్‌ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అంచనా వేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టోర్నీని నిర్వహించలేకపోతున్నామని, గతంలో కంటే ఈసారి అత్యధిక వీక్షకులు లీగ్‌ను చూస్తారని తెలిపారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకపోవడం కారణంగా.. టీవీల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ను వీక్షిస్తారని గంగూలీ అభిప్రాయపడ్డారు. దీని ద్వారా టీవీలకు అత్యధిక రేటింగ్‌ రానుందని  సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు. సెప్టెంబర్‌ 19న ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికలుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. (సీఎస్‌కేలో ఖేదం.. ఆర్సీబీలో మోదం)

షెడ్యూల్‌ ప్రకారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రన్నరఫ్‌ జట్టు సీఎస్‌కేను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. జట్టులోని  ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు పదిమంది సిబ్బంది వైరస్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం లీగ్‌ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉందని వార్తలూ వినిపించాయి. అయితే అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే లీగ్‌ను ప్రారంభిస్తామని ఇటీవల లీగ్‌ నిర్వహకులు ప్రకటించారు. మరోవైపు బిగ్‌ టోర్నీ కోసం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఐపీఎల్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. (రైనాకు సీఎస్‌కే దారులు మూసుకుపోయినట్లేనా..!)

మరిన్ని వార్తలు