South Africa T20 League: మళ్లీ సూపర్‌ కింగ్స్‌తో జతకట్టనున్న డుప్లెసిస్‌

11 Aug, 2022 13:44 IST|Sakshi

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌.. తన మాజీ ఐపీఎల్‌ జట్టైన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో (సీఎస్‌కే) తిరిగి జతకట్టనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో క్రికెట్‌ సౌతాఫ్రికా నిర్వహించే టీ20 లీగ్‌ కోసం సీఎస్‌కే యాజమాన్యం ఫాఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 

సఫారీ లీగ్‌ కోసం ఆటగాళ్ల (ఐదుగురు.. ఇందులో ఒకరు సౌతాఫ్రికన్‌ అయి ఉండాలి, ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉండాలి, ఇద్దరికి మించి ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు ఉండకూడదు, ఒక అన్‌ క్యాపడ్‌ ప్లేయర్‌ ఉండాలి)  డైరెక్ట్‌ అక్విజిషన్‌కు (నేరుగా ఎంపిక చేసుకునే సౌలభ్యం) ఆగస్ట్‌ 10 డెడ్‌లైన్‌ కావడంతో సీఎస్‌కే యాజమాన్యం స్థానిక కోటాలో ఫాఫ్‌ను ఎంచుకుంది. 

సఫారీ లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీల్లో ఒకటైన జోహన్నెస్‌బర్గ్‌ను సొంతం చేసుకున్న  సీఎస్‌కే యాజమాన్యం.. తాము ఎంపిక చేసుకున్న మిగతా నలుగురు ఆటగాళ్ల వివరాలను వెల్లడించలేదు. ఈ లీగ్‌లో పాల్గొనే మిగతా ఐదు జట్లు కూడా తమ స్టార్‌ సైనింగ్స్‌ను ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఫాఫ్‌ 2011 నుంచి 2021 వరకు సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించాడు. 2022 మెగా వేలంలో అతని ఆర్సీబీ సొంతం చేసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. 

కాగా, సఫారీ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్‌ను ముంబై ఇండియన్స్, జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్‌కే, సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యాలు దక్కించుకున్నాయి.
చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం

మరిన్ని వార్తలు