జొహన్నెస్‌బర్గ్‌ కెప్టెన్‌గా డుప్లెసిస్‌

16 Aug, 2022 05:02 IST|Sakshi

కేప్‌టౌన్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) పాత మిత్రులు స్టీఫెన్‌ ఫ్లెమింగ్, డుప్లెసిస్‌ మళ్లీ జట్టు కట్ట నున్నారు. సీఎస్‌కే యాజమాన్యం దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో కొనుగోలు చేసిన జొహన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ కోసం ఇద్దరు కలిసి పని చేయనున్నారు. ఈ జట్టుకు ఫ్లెమింగ్‌ కోచ్‌ కాగా, డుప్లెసిస్‌ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు చెన్నై డుప్లెసిస్‌ను విడుదల చేశాక ఈ ఏడాది బెంగళూరుకు సారథ్యం వహించి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) టి20 లీగ్‌లో ఓ మినీ సీఎస్‌కే జట్టే బరిలోకి దిగబోతోంది.

ఎందుకంటే మొయిన్‌ అలీ (ఇంగ్లండ్‌), మహీశ్‌ తీక్షణ (శ్రీలంక), రొమారియో షెఫర్డ్‌ (విండీస్‌)లు కూడా జొహన్నెస్‌బర్గ్‌ జట్టులో ఉన్నారు. ఆటగాళ్లే కాదు కోచింగ్‌ సిబ్బంది కూడా సీఎస్‌కేతోనే నిండిపోతోంది. ఫ్లెమింగ్‌ హెడ్‌కోచ్‌గా, ఎరిక్‌ సిమన్స్‌ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు సీఎస్‌కేకు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌  ఆల్బీ మోర్కెల్‌ను కూడా జొహన్నెస్‌బర్గ్‌ జట్టు కోచింగ్‌ సిబ్బందిలో నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సీఎస్‌ఏ టి20 లీగ్‌ జరిగే అవకాశముంది.

మరిన్ని వార్తలు