Fake IPL League: గుజరాత్‌లో ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్‌లు.. రష్యా పంటర్లకు గాలం

11 Jul, 2022 17:04 IST|Sakshi

ఐపీఎల్‌ పేరిట నకిలీ మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు గుజరాత్‌ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఓ ముఠా ఐపీఎల్‌ పేరిట ఫేక్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తూ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సాంకేతికత ద్వారా అచ్చం ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లా చిత్రీకరించిన ఈ మ్యాచ్‌ల ద్వారా సదరు ముఠా రష్యాలోని బెట్టింగ్‌ రాయుళ్లకు గాలం వేస్తోంది. ఈ ఫేక్ ఐపీఎల్‌లో వ్యవసాయ కూలీలే ఆటగాళ్లు. ఒక్కో మ్యాచ్‌లో ఆటగాడిగా నటించినందుకు గాను వీరికి లభించే రెమ్యునరేషన్‌ రూ.400. 

వీరు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలు ధరించి నిజమైన ఆటగాళ్లలా బిల్డప్‌ ఇస్తుంటారు. ఈ మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు బొమ్మ వాకీ టాకీలు పట్టుకుని నిజమైన అంపైర్ల కంటే ఎక్కువ ఫోజులు కొడుతుంటారు. హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్‌ ఐపీఎల్‌ మొత్తానికే హైలైట్. ఈ మ్యాచ్‌లను హెచ్‌డీ కెమెరాలతో రికార్డు చేసి ఐపీఎల్‌ పేరుతో యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేస్తుంటారు. 

ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కో తదితర ప్రాంతాల నుంచి పంటర్లు (పందెం కాసేవాళ్లు) బెట్టింగ్‌లు పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయంశంగా మారింది. నిజమైన ఐపీఎల్‌ను తలపించే ఈ ఫేక్‌ ఐపీఎల్‌ గురించి తెలిసి క్రికెట్‌ ఫాలోవర్స్‌ నివ్వెరపోతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్‌ ఐపీఎల్ నిర్వహణకు సూత్రధారి షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్‌ కేంద్రంలో గతంలో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. 
చదవండి: వరల్డ్ ఎలెవెన్‌తో టీమిండియా మ్యాచ్‌..ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు