ఏపీ మంత్రి రోజాను కలిసిన ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవీయ

8 Feb, 2023 14:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్‌పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవీయను రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్ & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అభినందించారు. ఆశా మాలవీయలక్ష్యం నెరవేరాలని మంత్రి ఆకాంక్షించారు. బుధవారం సచివాలయంలోని చాంబర్‌లో ఆశా మాలవీయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్ని మాలవ్య మంత్రికి వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా భద్రత, సాధికారత సాధనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మాలవీయకు వివరించారు.  కిశోర బాలికలు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యను కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన న్యాప్కిన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో టాయిలెట్ల అభివృద్ది, నిర్వహణ.. మహిళల రక్షణ, భద్రతకై దిశా యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు.. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు తదితర కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత, సాధికారత అంశాలు ఆమోఘం: ఆశా మాలవీయ

ఈ సందర్బంగా ఆశా మాలవ్య మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణిని అని, సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని, నవంబర్‌ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించి ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తి చేయడం జరిగిందని మంత్రికి వివరించారు.  

తన సైకిల్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ లో మంచి ఆదరణ లభించిందని, అటు వంటి ఆదరణ తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కూడా లభించలేదని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డిని కలిసినప్పుడు వారు ఎంతగానో తనను ఆదరించారని, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, సాధికారత సాధనకు అమోఘమైన చర్యలు చేపడుతుందని కొనియాడారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్‌ పనితీరు అమోఘంగా ఉందని, ఆ యాప్‌ను తాను కూడా డౌన్ లోడ్ చేసుకుని పరిశీలించడం జరిగిందని, పోలీసుల ప్రతిస్పందన చాలా బాగుందని అన్నారు.

ఋతుస్రావ సమస్య వల్ల కిశోర బాలికల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత, సాధికారత సాధనకై అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికే అదర్శమని అభివర్ణించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా బొబ్బిలి వీణను ఆశా మాలవ్యకు బహుకరిస్తూ.. ఎలాంటి అవసరం సహకరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు