PAK Vs SA: మహ్మద్‌ నవాజ్‌ రనౌటా లేక ఎల్బీనా?

3 Nov, 2022 15:33 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటర్‌ మహ్మద్‌ నవాజ్‌ ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ ఆఖరి బంతికి నవాజ్‌ ప్యాడ్లను తాకుతూ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ నవాజ్‌ ఎలాంటి రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే రిప్లేలో మాత్రం బంతి ముందు బ్యాట్‌ను తాకినట్లు స్పైక్స్‌ కనిపించాయి. ఒకవేళ నవాజ్‌ రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌ అయ్యేవాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ జరిగింది.  అంపైర్‌ ఔట్‌ ఇచ్చేసరికే మహ్మద్‌ నవాజ్‌ క్రీజు బయట ఉన్నాడు. అప్పుడే బంతిని అందుకున్న ఫీల్డర్‌ డైరెక్ట్‌ త్రోతో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి నవాజ్‌ క్రీజులోకి చేరుకోలేదు. అయితే నవాజ్‌ పెవిలియన్‌ బాట పట్టింది రనౌట్‌ అయినందుకా లేక ఎల్బీగానా అన్నది ఎవరికి అర్థం కాలేదు.

ఒకవేళ​ నవాజ్‌ రివ్యూ తీసుకొని ఫలితం అనుకూలంగా వచ్చినా రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ క్రికెట్‌ రూల్స్‌ ప్రకారం అంపైర్‌ ఒకసారి తన వేలిని పైకెత్తిన తర్వాత బంతిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. ఈ దశలో రనౌట్‌ చేసినా పనికిరాదు. మొత్తానికి తాను ఎలా ఔటయ్యాననే దానిపై క్లారిటీ లేకుండానే మహ్మద్‌ నవాజ్‌ పెవిలియన్‌ చేరడం ఆసక్తి కలిగించింది.

ఇక పాకిస్తాన్‌కు సెమీస్‌ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్‌ అహ్మద్‌ 51, షాదాబ్‌ ఖాన్‌ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్‌ హారిస్‌, మహ్మద్‌ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు.

చదవండి:  పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం?

మరిన్ని వార్తలు