విరు‍ష్క తనయ ఫోటోల విషయంలో నెటిజన్ల ఆగ్రహం

22 Mar, 2021 20:14 IST|Sakshi

పూణే: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని సతీమణి అనుష్క శర్మ.. తమ బిడ్డ విషయంలో మీడియాను ఎంత ప్రాధేయపడ్డా, అర్ధం చేసుకోవడం లేదని విరుష్క అభిమానులు మండిపడుతున్నారు. పూణే ఎయిర్‌పోర్టులో విరుష్క జోడీ.. తమ గారాలపట్టితో వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించి వామిక(కోహ్లి, అనష్కల కుమార్తె) ఫోటోలను తీసేందుకు ప్రయత్నించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు మాసాలు కూడా దాటని పసిబిడ్డ విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో భయాలు ఉంటాయని, కనీసం వాటిని గౌరవించైనా మీడియా, వామిక ఫోటోల కోసం ఎగబడడం మానుకోవాలని హితవు పలికారు. ఇక్కడ చదవండి: ఏందిది కోహ్లీ.. ఇంకెన్నాళ్లు దాచి పెడతావ్‌!

కోహ్లి దంపతులు.. తమ బిడ్డ ప్రైవసీకి భంగం కల్గించవద్దని అభిమానులను, మీడియాను ప్రాధేయపడ్డ సంగతి తెలిసిందే. తమ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, కంటెంట్‌ను కానీ మీడియాలో ఎక్కడా ప్రస్థావించవద్దని వారు మీడియాకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. కొందరు ఫోటోగ్రాఫర్లు తమ వార్తల కోసం పసిబిడ్డ ఫోటోలను వాడుకోవడంపై సోషల్‌ మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లి కుటుంబానికి సంబంధించిన ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 11న కోహ్లి సతీమణి అనుష్క ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఇంగ్లండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు కోహ్లి పూణేకు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటన ప్రారంభమైన నాటి నుంచి కోహ్లి తన కుటుంబంతో కలిసే ఉంటున్నాడు.

మరిన్ని వార్తలు