Trolls On Pat Cummins: బౌన్సర్‌ వేద్దామని దెబ్బతిన్నాడు.. అందుకే కేకేఆర్‌ తగ్గించేసింది

2 Mar, 2022 14:28 IST|Sakshi

ఆస్ట్రేలియా జట్టు 24 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టింది. పాకిస్తాన్‌తో ఆసీస్‌ మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. తొలి టెస్టు జరగనున్న రావల్పిండి స్టేడియంలో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌తో పాటు స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ తదితరులు ప్రాక్టీస్‌లో జోరు పెంచారు. నెట్‌ సెషన్‌లో భాగంగా కమిన్స్‌.. స్మిత్‌కు బౌన్సర్‌ వేయాలని భావించాడు. కానీ బంతి అదుపు తప్పి బౌన్సర్‌ కాస్త ఊరించే బంతిగా మారింది.

దీంతో క్రీజులో ఉన్న స్మిత్‌.. లాంగాఫ్‌ దిశగా భారీ సిక్స్‌ బాదాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. కమిన్స్‌ను ట్రోల్‌ చేశారు. ''బౌన్సర్‌ వేద్దామనుకొని దెబ్బతిన్నాడు.. అందుకే కేకేఆర్‌ ఐపీఎల్‌ మెగావేలంలో అతనికి సగానికి సగం ధర తగ్గించేసింది'' అంటూ కామెంట్‌ చేశారు. కాగా కేకేఆర్‌.. పాట్‌ కమిన్స్‌ను రూ. 7.25 కోట్లుకు కొనుగోలు చేసింది. ఇంతకముందు ఇదే కమిన్స్‌ను కేకేఆర్‌ 2020 వేలం సందర్భంగా రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు వేలంలో స్టీవ్‌ స్మిత్‌ మాత్రం అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు.

ఇక పాట్‌ కమిన్స్‌ విదేశాల్లో కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్‌. టిమ్‌ పైన్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కమిన్స్‌ సారధ్యంలోని ఆసీస్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక  యాషెస్‌ సిరీస్‌ను 4-0తో గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు జట్టు హెడ్‌కోచ్‌ పదవి నుంచి జస్టిన్‌ లాంగర్‌ తప్పుకోవడం కాస్త కలవరం రేపింది. ఆ తర్వాత లాంగర్‌  స్థానంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. 

చదవండి: Novak Djokovic: నెంబర్‌ వన్‌ పాయే.. 15 ఏళ్ల బందానికి ముగింపు పలికిన జొకోవిచ్‌

ఆస్ట్రేలియాతో చారిత్రక సిరీస్‌కు ముందు పాక్‌కు ఎదురు దెబ్బ.. కీలక ఆటగాడికి కరోనా

మరిన్ని వార్తలు