3911 రోజుల తర్వాత రీఎంట్రీ

13 Aug, 2020 18:21 IST|Sakshi

10 ఏళ్ల తర్వాత జట్టులో చోటు

అరుదైన జాబితాలో ఫావద్‌ అలామ్‌

సౌతాంప్టన్‌: పాకిస్తాన్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఫావద్‌ అలామ్‌ పదేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించుకున్నాడు. చివరిసారి 2009, నవంబర్‌లో పాకిస్తాన్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన అలామ్‌కు ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో అవకాశం రాలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో అలామ్‌కు అవకాశం కల్పిస్తూ పీసీబీ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఇలా సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడిన రెండో పాక్‌ క్రికెటర్‌గా అలామ్‌ గుర్తింపు పొందాడు. (‘ట్రిపుల్‌ సెంచరీ’ హీరోకు కరోనా!)

ఇంగ్లండ్‌తో తాజా మ్యాచ్‌కు ముందు అలామ్‌ ఆడిన టెస్టుల సంఖ్య మూడు కాగా, 10 ఏళ్ల, ఎనిమిది నెలల విరామం వచ్చింది. అలామ్‌ ఆడిన మూడో టెస్టు మ్యాచ్‌కు నాల్గో టెస్టు మ్యాచ్‌కు మధ్య వచ్చిన గ్యాప్‌ 3,911 రోజులు.  టెస్టుల పరంగా చూస్తే 88. దాంతో దశాబ్దం విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడిన అరుదైన క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. పాకిస్తాన్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన అలామ్‌.. వన్డే మ్యాచ్‌ ఆడి ఐదేళ్లు దాటేసింది.  2005, ఏప్రిల్‌ 22వ తేదీన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అలామ్‌ చివరిసారి వన్డే ఫార్మాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత పాక్‌ జట్టుకు దూరమైన అలామ్‌కు అనూహ్యంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం నిజంగానే గొప్ప ఘనత.

అలామ్‌ చివరి టెస్టు ఆడిన సమయానికి విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌లు ఇంకా లాంగెస్ట్‌ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయలేదు. ఇంగ్లండ్‌తో టెస్టు ఆడుతున్న అలామ్‌.. అంతకుముందు ఆడిన మూడు టెస్టుల్లో ఒక సెంచరీ సాధించాడు. టెస్టుల్లో 41.66 సగటుతో 250 పరుగులు సాధించాడు. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ఆడిన తర్వాత పాక్‌ జెర్సీలో కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. అంతకుముందు యూసఫ్‌ అహ్మద్‌ 104 టెస్టులను మిస్‌ అయిన తర్వాత మళ్లీ ఆడగా, ఆ తర్వాత స్థానంలో నిలిచిన పాక్‌ క్రికెటర్‌ అలామ్‌. 1969-1987 మధ్య కాలంలో యూసఫ్‌ మహ్మద్‌ క్రికెట్‌ ఆడాడు. అతనికి 18 ఏళ్ల టెస్టు మ్యాచ్‌ రావడం ఇక్కడ గమనార్హం. 

>
మరిన్ని వార్తలు