FIH Pro League: రాణి రాంపాల్‌ రీ ఎంట్రీ.. కెప్టెన్‌గా సవిత!

6 Apr, 2022 07:46 IST|Sakshi

రాణి రాంపాల్‌ పునరాగమనం

FIH Pro League 2021-2022- న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ స్టార్‌ స్ట్రయికర్, గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాణి రాంపాల్‌ తిరిగి జట్టులోకి వచ్చింది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌తో ఈనెల 8, 9 తేదీల్లో రెండు మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది.

గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్‌ కెప్టెన్సీలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌ తర్వాత తొడ కండరాలు సహా ఇతరత్రా గాయాలతో ఆమె మళ్లీ మైదానంలోకే దిగలేదు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ సంతరించుకోవడంతో జట్టుకు ఎంపికైంది. కానీ సీనియర్‌ గోల్‌కీపర్‌ సవితనే సారథిగా కొనసాగించనున్నారు.  

మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్‌), రజని, దీప్‌ గ్రేస్, గుర్జీత్, నిక్కీ, ఉదిత, రష్మిత, సుమన్‌ దేవి, నిషా, సుశీలా చాను, జ్యోతి, నవజ్యోత్‌ కౌర్, మోనిక, నమిత, సోనిక, నేహ, మహిమ, ఐశ్వర్య, నవ్‌నీత్‌ కౌర్, రజ్విందర్‌ కౌర్, రాణి రాంపాల్, మరియానా కుజుర్‌.

అజేయంగా ముందుకు... 
పాట్‌చెఫ్‌స్ట్రూమ్‌: జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. మలేసియాతో మంగళవారం జరిగిన పూల్‌ ‘డి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–0తో నెగ్గి ‘హ్యాట్రిక్‌’ విజయాలు నమోదు చేసింది.

ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ తొమ్మిది పాయింట్లతో పూల్‌ ‘టాపర్‌’గా నిలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్‌ తలపడుతుంది. మలేసియాతో జరిగిన పోరులో భారత్‌ తరఫున ముంతాజ్‌ (10వ, 26వ, 59వ ని.లో) మూడు గోల్స్‌ సాధించగా... మరో గోల్‌ను సంగీత కుమారి (11వ ని.లో) చేసింది.
 

చదవండి: IPL 2022: శభాష్‌ షహబాజ్‌... సూపర్‌ కార్తీక్‌! ఆర్సీబీ సంచలన విజయం

మరిన్ని వార్తలు