సిరీస్‌ ఎవరిదో?

16 Sep, 2020 07:05 IST|Sakshi

నేడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య నిర్ణాయక మూడో వన్డే

జట్టులోకి స్టీవ్‌ స్మిత్‌..!

సాయంత్రం గం. 5.30 నుంచి 

సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మాంచెస్టర్‌ : ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు ఇక్కడ జరిగే చివరిదైన మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కరోనా విరామం అనంతరం సొంత మైదానంలో ఆడిన ప్రతి సిరీస్‌ను గెలుస్తూ వచ్చిన ఇంగ్లండ్‌... ఇక్కడ కూడా గెలిచి అజేయంగా నిలవాలని చూస్తోంది. మరోపక్క ప్రత్యర్థి చేతిలో టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయి డీలా పడ్డ కంగారూ జట్టులో... వన్డే సిరీస్‌ అయినా గెలవాలనే కసి కనిపిస్తోంది.

తొలి వన్డేలో ఆసీస్‌ గెలవగా... రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఆ పని చేసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమానంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. అయితే డేవిడ్‌ వార్నర్‌ ఫామ్‌పై ఆసీస్‌ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు అతడు తన బ్యాట్‌ను ఝళిపించలేదు. మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా జట్టుకు శుభవార్త. గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌... ఈ వన్డేలో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడు మంగళవారం నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.   

మరిన్ని వార్తలు