ఆ జాబితాలో ఫించ్‌ కూడా చేరాడు..

5 Mar, 2021 22:24 IST|Sakshi

వెల్లింగ్టన్: ఆసీస్‌ పరిమిత ఓవర్ల  కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఫించ్ విధ్వంసకర వీరుల జాబితాలో చేరాడు. టీ20ల్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ (127) రెండో స్థానంలో, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113) మూడో స్థానంలో, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో (107) నాలుగులో, విండీస్‌ యోధుడు గేల్ (105) ఐదో స్థానంలో ఉన్నారు. తాజాగా ఫించ్‌ వీరి సరసన చేరాడు. కాగా, టీ20 ఫార్మాట్‌లో ఆసీస్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఫించే కావడం విశేషం. 

ఫించ్ 70 ఇన్సింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, 14 అర్థ సెంచరీల సాయంతో 2,310 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా. సహచర ఆటగాడు వార్నర్ 81 మ్యాచ్‌ల్లో సెంచరీ, 18 అర్ధ సెంచరీల సాయంతో 2,265 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఫింఛ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్‌ 50 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 2-2తో సమంగా నిలిచింది.

మరిన్ని వార్తలు