IPL 2022 Eliminator Match: లక్నో, ఆర్‌సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌.. ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్‌

26 May, 2022 18:12 IST|Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌కు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్‌ మ్యాచ్‌ చూస్తూనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్‌(ఏఆర్‌ఎస్‌) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్‌కు చెందిన సునీల్‌ కుమార్‌​, అజయ్‌ కుమార్‌​, అమర్‌ కుమార్‌, ఒబేదా ఖలీల్‌, అనికెత్‌ కుమార్‌లుగా గుర్తించారు.

ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్‌-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్‌ చూడకుండా మొబైల్‌ ఫోన్స్‌లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్‌ వారిని అరెస్ట్‌ చేసి మొబైల్‌ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్‌ కోల్‌కతాలోని న్యూ మార్కెట్‌ ఏరియాలో ఉన్న ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు, పోర్టబుల్‌ రూటర్‌ చార్జర్‌లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రజత్‌ పాటిదార్‌ సూపర్‌ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్‌-2లో అమితుమీ తేల్చుకోనుంది. 

చదవండి:  'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

డెత్‌ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం

మరిన్ని వార్తలు