కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్‌

20 May, 2021 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరుగాంచిన దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. ఇటీవల ఇంట్లో పని చేసే సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతను పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్న మిల్కా పరిస్థితి నిలకడగానే ఉందని అతని భార్య నిర్మల్‌ కౌర్‌ తెలిపారు. కాగా, మిల్కా వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుమార్తె మోనా మిల్కా సింగ్‌ న్యూయార్క్‌ నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో వైద్యురాలు కావడంతో ఎప్పటికప్పుడు వీడియో కాల్‌ ద్వారా సలహాలు సూచనలు ఇస్తుందని నిర్మల్‌ కౌర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్కా సింగ్‌ మాట్లాడుతూ.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, బుధవారం జాగింగ్‌ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కోవిడ్‌ పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్‌ రావడంతో ఆశ్యర్యపోయానని పేర్కొన్నారు. 

కాగా, అథ్లెట్‌గా ఎంతో ఖ్యాతి గడించిన మిల్కా సింగ్‌.. ఒలింపిక్‌ పతకం మాత్రం సాధించలేకపోయారు. కెరీర్‌లో ఎన్నో మరపురాని మారథాన్లలో పాల్గొన్న అతనికి.. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేస్‌ చాలా ప్రత్యేకం. ఈ పోటీల్లో అతను నాలుగో స్థానంలో నిలిచినా.. ట్రాక్‌పై అతను చూపిన తెగువతో భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ రేస్‌ ద్వారా అతను ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన ఏకైక అథ్లెట్ కూడా అతనే కావడం విశేషం.
చదవండి: టీమిండియా కోచ్‌గా ద్రవిడ్, కెప్టెన్‌గా ధవన్‌..?

మరిన్ని వార్తలు