Amitabh Choudhary Death: బీసీసీఐ మాజీ సంయుక్త కార్యదర్శి హఠాన్మరణం.. సీఎం సంతాపం

16 Aug, 2022 12:33 IST|Sakshi
అమితాబ్‌ చౌదరి(PC: BCCI)

Amitabh Choudhary: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాజీ సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. అమితాబ్‌ చౌదరి స్వస్థలం ఝార్ఖండ్‌లోని రాంచి. కాగా అశోక్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో అమితాబ్‌ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే అమితాబ్‌ మరణించినట్లు సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా అమితాబ్‌ చౌదరి గతంలో ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జేపీఎస్‌సీ) చైర్మన్‌గా పనిచేశారు.

ముఖ్యమంత్రి సంతాపం
అమితాబ్‌ చౌదర్‌ ఆ‍కస్మిక మరణం పట్ల ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విచారం వ్యక్తం చేశారు. ‘‘జేపీఎస్‌సీ చైర్మన్‌ అమితాబ్‌ చౌదరీ జీ మరణించారన్న విషాదకర వార్త తెలిసింది. ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి’’ అని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలంటూ సంతాపం ప్రకటించారు.

ఐపీఎస్‌ ఆఫీసర్‌గా..
ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన అమితాబ్‌ చౌదరి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఝార్ఖండ్‌లో ఐజీపీ ర్యాంకులో పనిచేశారు. కాగా జేపీఎస్‌ చైర్మన్‌గా రాంచిలో మెరుగైన క్రికెట్‌ స్టేడియంలు నిర్మించడంలో... మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు. గతంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. 

అయితే, 2005 నాటి జింబాబ్వే టూర్‌ మాత్రం ఆయన కెరీర్‌లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అప్పటి కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఆనాటి టీమిండియా కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ మధ్య తలెత్తిన విభేదాలు వివాదానికి దారితీశాయి.
చదవండి: విరాట్‌ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన గంగూలీ

మరిన్ని వార్తలు