'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి'

22 Jan, 2021 18:00 IST|Sakshi

లండన్‌: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-1తో ఓడించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ గడ్డ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆసీస్‌పై స్టన్నింగ్‌ విక్టరీ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు నూతనొత్తేజంతో సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్ ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. సన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో స్వాన్‌ మాట్లాడాడు.

'ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు ఇదే నా హెచ్చరిక.. రానున్నది కఠినమైన సిరీస్‌.. ఎందుకంటే టీమిండియా స్వదేశంలో సింహంలా గర్జింస్తుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం తర్వాత ఆ జట్టు మరింత బలోపేతంగా తయారైంది. ఎప్పుడో జరిగే యాషెస్‌ సిరీస్‌ను పక్కనబెట్టి టీమిండియాతో జరిగే సిరీస్‌ గురించి ఆలోచించండి. అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోకుండా.. భారత్‌ను ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి పెడితే బాగుంటుంది. 2012 తర్వాత మనం టీమిండియాను వారి గడ్డపై ఓడగొట్టలేకపోయాం.. టీమిండియా పిచ్‌లె స్పిన్నర్లకు స్వర్గధామం.. కాబట్టి రానున్న సిరీస్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి.. బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడితే తప్ప భారత్‌పై గెలవడం అసాధ్యం. 'అని తెలిపాడు.చదవండి: ఐపీఎల్‌: రిటైన్‌ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం

2013లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న గ్రేమ్‌ స్వాన్‌ ఇంగ్లండ్‌ తరపున 60 టెస్టుల్లో 255, 79 వన్డేల్లో 104, 39 టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. కాగా ఇంగ్లండ్‌ జట్టు పర్యటన వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్‌ అయినందుకు గర్విస్తున్నా'

మరిన్ని వార్తలు