పాకిస్తాన్‌కు ఆడాల్సింది కాదు.. తప్పు చేశా

9 May, 2021 15:53 IST|Sakshi

సమీ అస్లామ్‌.. 2015 నుంచి 2017 వరకు పాకిస్తాన్‌ తరపున క్రికెట్‌ ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను పాక్‌ తరపున 13 టెస్టుల్లో 758 పరుగులు.. 4 వన్డేల్లో 78 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అస్లామ్‌కు అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. తాజాగా మేజర్‌ క్రికెట్‌ టోర్నీ పేరుతో యూఎస్‌లో టీ20 లీగ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు అస్లామ్‌ అందులో ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. కాగా తాను పాకిస్తాన్‌ తరపున క్రికెట్‌ ఆడి తప్పు చేశానంటూ అస్లామ్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

'అసలు నేను అమెరికాకు వచ్చి క్రికెట్‌ ఆడుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఈరోజు పాక్‌ను విడిచిపెట్టి ఇలా మేజర్‌ లీగ్‌ టోర్నీలో జాయిన్‌ అవడానికి ఒక కారణం ఉంది. పాక్‌ జట్టులో నాకు ఎన్నడు సరైన గుర్తింపు లేదు. అక్కడి కోచ్‌లు.. సెలెక్టర్లు నన్నెప్పుడు చిన్నచూపు చూసేవారు. ఒక దశలో జీవితం మీద విరక్తి వచ్చి చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. అలా రెండేళ్లు గడిచిపోయాయి. పాకిస్తాన్‌ తరపున క్రికెట్‌ ఆడాల్సింది కాదు.. అది కరెక్ట్‌ ప్లేస్‌ కాదు. నామీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం విడిచి యూఎస్‌ వచ్చాను. అలా మేజర్‌ క్రికెట్‌ టోర్నీలో అడుగుపెట్టాను, ఇప్పటికీ పాకిస్తాన్‌ నుంచి దాదాపు 100 మంది ఫస్ట్‌క్లాస్‌ ఆటగాళ్లు నాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పాక్‌ క్రికెట్‌లో జరుగుతున్న అక్రమాలను తెలుసుకొని కొంతమంది మేజర్‌ లీగ్‌ టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

మరిన్ని వార్తలు