Asad Rauf Death: క్రికెట్‌లో విషాదం.. అంపైర్‌ అసద్‌ రౌఫ్‌ హఠాన్మరణం

15 Sep, 2022 07:13 IST|Sakshi

క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఐసీసీ మాజీ అంపైర్‌ పాకిస్తాన్‌కు చెందిన అసద్‌ రౌఫ్‌(66) గుండెపోటుతో కన్నుమూశారు. 66 ఏళ్ల అసద్‌ రౌఫ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్‌ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు( 49 టెస్టులు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా.. 15 మ్యాచ్‌లు టీవీ అంపైర్‌గా), 139 వన్డేలు, 28 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. పాకిస్తాన్‌ నుంచి అలీమ్‌ దార్‌ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అసద్‌ రౌఫ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా పనిచేశాడు.

అయితే 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం అసద్‌ రౌఫ్‌ మెడకు చుట్టుకుంది. అసద్‌ రౌఫ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బీసీసీఐ అతడ్ని పక్కన పెట్టి విచారణకి ఆదేశించింది.

సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికి అంపైర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్‌కు అంపైరింగ్‌ వదిలేసిన అసద్‌ రౌఫ్‌ లాహోర్‌లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: గంగూలీ, జై షాలకు జై

మరిన్ని వార్తలు