ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి

30 May, 2021 21:08 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని మరో ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తన స్వస్థలం రాంచీలో విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్న ఈ ఝార్ఖండ్‌ డైనమైట్‌.. ఇటీవలే ముంబైలో ఓ విల్లాను, తాజాగా పూణేలోని పింప్రి-చిన్చ్వాడ్‌లో ఓ నూతన భవంతిని హస్తగతం చేసుకున్నాడు. పూణేలో రియల్‌ ఎస్టేట్‌కు మంచి డిమాండ్‌ ఉండటంతో రావేట్‌లోని ఎస్టాడో ప్రెసిడెన్షియల్‌ సొసైటీలో అతను నూతన భవంతి నిర్మాణాన్ని చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను కొద్దిరోజుల కిందట అతని భార్య సాక్షి సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  

కాగా, ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వివిధ ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్‌ ద్వారా ఏటా కోట్లల్లో అర్జిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. క్రికెట్‌ ఆడుతూనే రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇటీవలే అతను వినోద రంగంలోనూ అడుగుపెట్టాడు. ముంబైలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్‌డీ ఎంటర్‌టైన్మెంట్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ధోని నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి స్టార్‌ ఆటగాడు ఔట్‌

మరిన్ని వార్తలు