Mohammad Hussain: పాక్ మాజీ క్రికెటర్ అకాల మరణం.. పీసీబీ దిగ్భ్రాంతి

12 Apr, 2022 15:32 IST|Sakshi

Former Pakistan Spinner Mohammad Hussain Passed Away: పాకిస్థాన్‌ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల వయసులో ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్ హుస్సేన్ ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్‌ కూడా అయిన హుస్సేన్‌.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. హుస్సేన్‌ అకాల మరణంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ.. హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. 


లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్, లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌ అయిన మహ్మద్‌ హుస్సేన్‌ 1996-98 మధ్యలో పాకిస్థాన్ తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు ఆడాడు. ఇందులో 172 పరుగులు సాధించి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇండిపెండెన్స్‌ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హుస్సేన్‌ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించలేకపోయిన హుస్సేన్‌.. పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 131 మ్యాచ్‌ల్లో 454 వికెట్లు సాధించాడు. 

కాగా, 1997 సహారా కప్‌ (భారత్‌-పాక్‌) సందర్భంగా శివ్ కుమార్ అనే భారత సంతతి కెనడియన్‌పై  జరిగిన దాడి ఘటనలో ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌తో పాటు మహ్మద్‌ హుస్సేన్‌ నిందితుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా శివ్‌ కుమార్‌పై ఇంజమామ్‌ బ్యాట్‌తో దాడి చేయగా, 12వ ప్లేయర్‌గా ఉన్న మహ్మద్ హుస్సేన్ ఇంజమామ్‌కు బ్యాట్‌ అందించి సహకరించాడు. 
చదవండి: IPL 2022: వరుస ఓటములతో కుంగిపోయిన సీఎస్‌కేకు మరో భారీ షాక్‌..!

మరిన్ని వార్తలు