మాజీ క్రికెటర్‌పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం

19 Apr, 2021 18:00 IST|Sakshi
దిల్హారా లోకుహెట్టిగే(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌:  శ్రీలంక మాజీ క్రికెటర్‌ దిల్హారా లోకుహెట్టిగే‌పై ఎనిమిదేళ్ల నిషేధం పడింది. అతనిపై అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్‌  ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుదీర్ఘ నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. 2013లో శ్రీలంక తరఫున చివరిసారి ఆడిన అతను దాదాపు ఎనిమిదేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కానీ శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దిల్హారా లోకుహెట్టిగేపై అవినీతి, ఫిక్సింగ్‌లకు పాల్పడినట్లు  ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం ధృవీకరించింది.. ఐసీసీ ఆర్టికల్ 2.1.1 నియమావళి ప్రకారం ఫిక్సింగ్ చేయడానికి సహకరించడం, ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి అంగీకరించడం లాంటి తప్పిదాలను చేసినట్లు సదురు అవినీతి నిరోధక విభాగం గుర్తించింది.

అదే సమయంలో ఇతరులను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గానీ ప్రలోభపెట్టడం. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించేందుకు సలహాలు ఇవ్వడం, ఆశ చూపడం వంటి తప్పిదాలకు పాల్పడ్డాడు. ఆర్టికల్ 2.1.4 నియమావళి ప్రకారం దీన్ని ఉల్లంఘిస్తే నిషేధం తప్పనిసరి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టీ10 లీగ్‌లో నిబంధనలు ఉల్లంఘించి ఫిక్సింగ్‌కు సహకరించడంతో లోకుహెట్టిగేపై బ్యాన్‌ తప్పలేదు. శ్రీలంక తరఫున 2005 నుంచి 2013 వరకూ అతను అంతర్జాతీయ క్రికెట్‌  ఆడాడు.  జాతీయ జట్టుకు 9 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే లోకుహెట్టిగే ప్రాతినిథ్యం వహించాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అతనికి అంతర్జాతీయ సెంచరీలు కానీ హాఫ్‌ సెంచరీలు కానీ లేవు. 

మరిన్ని వార్తలు