French Open 2022: సెమీస్‌లోనే ముగిసిన బోపన్న పోరాటం

3 Jun, 2022 07:43 IST|Sakshi

పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్‌ మార్సెలో అరివలో (సాల్వేడార్‌)–జీన్‌ జులియెన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్‌ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్‌–డచ్‌ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు.

2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్‌ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్‌ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్‌ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్‌ హక్‌ ఖురేషీ (పాకిస్తాన్‌)తో కలిసి 2010 యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.  

మరిన్ని వార్తలు