IND Vs ENG: 40 ఏళ్లుగా ఒక్క మ్యాచ్‌ మిస్‌ కాలేదు; స్నేహితుని గుర్తుగా

4 Aug, 2021 20:00 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే అది ఆటలో అనుకుంటే పొరపాటే.  విషయంలోకి వెళితే.. భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్కు ప్రేక్షకులను అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ జరగుతున్న సమయంలో కెమెరాను స్టాండ్స్‌లోకి తిప్పగా .. ఒక వరుసలో కొంతమంది కూర్చొని ఉన్నారు. అయితే ఆ బృందంలో ఒక సీటును మాత్రం ఖాళీగా ఉంచారు. అదేంటా అని ఆరా తీస్తే ఒక విషాదకర విషయం తెలిసింది.

జాన్‌ క్లార్క్‌ అనే వ్యక్తి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరిగే ప్రతీ మ్యాచ్‌కు హజరయ్యేవాడు. గత 40 ఏళ్లలో జాన్‌ ఏనాడు మ్యాచ్‌ను మిస్‌ కాలేదు. అయితే నేడు ఇంగ్లండ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు జాన్‌ క్లార్క్‌ రాలేదు.. కారణం.. కొంతకాలం కిందట ఆయన చనిపోయారు. అయితే ట్రెంట్‌బిడ్జ్‌ మైదానంతో జాన్‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అతని మిత్రులు ఒక గొప్ప ఆలోచనతో అతన్ని గౌరవించుకున్నారు. బౌతికంగా జాన్‌ క్లార్క్‌ లేకపోయినా అతని కోసం ఒక టికెట్‌ను కొనడమే గాక.. అతని సీటును ఖాళీగా ఉంచి తమ స్నేహ బందాన్ని గొప్పగా చాటుకుంది ఆ మిత్రుల బృందం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. పరుగలు ఖాతా తెరవకుండానే ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సిబ్లీ, జాక​ క్రాలీలు ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు 27 పరుగులు చేసిన క్రాలీ సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్‌ విరామం అనంతరం 2 వికెట్ల నష్టానికి 66 పరుగులతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ను ఈసారి షమీ దెబ్బతీశాడు. 18 పరుగులు చేసిన సిబ్లీ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 45, జానీ బెయిర్‌ స్టో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు