Gautam Gambhir: కీలక ప్రకటన.. త్వరలోనే కొత్త లీగ్‌ ఆరంభం!

11 Sep, 2021 12:41 IST|Sakshi

Gautam Gambhir announces East Delhi Cricket League: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్‌ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా శుక్రవారం  ప్రకటించారు. కాగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌గా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ జట్ల మాజీ కెప్టెన్‌) పేరొందిన గౌతం గంభీర్‌ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్‌.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్‌ ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు సమాచారం. 17- 36 ఏళ్ల మధ్య వయస్కులైన క్రికెటర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

అత్యాధునికంగా యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌
రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్‌ లైట్స్‌, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు​ పిచ్‌లు, డిజిటల్‌ స్కోరు బోర్డు డిస్‌ప్లే, కానపీ, జాగింగ్‌ ట్రాక్‌ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: T20 World Cup: అతడు తోలుబొమ్మ.. జట్టులో మార్పులు తథ్యం.. వీళ్లను తీసుకోవాలి!

మరిన్ని వార్తలు