Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

9 Sep, 2021 19:18 IST|Sakshi

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టుకు మెంటర్‌గా మాజీ కెప్టెన్‌ ధోనిని నియమించడంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ విభిన్నంగా స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లుండగా మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతో మహీని మెంటర్‌గా ఎంపిక చేసి ఉండవచ్చంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. 

ప్రముఖ క్రీడా ఛానల్‌లో జరిగిన ఓ షోలో మాట్లాడిన గంభీర్.. మెంటర్‌గా ధోని ఎంపికకు గల కారణాలను విశ్లేషించాడు. పొట్టి ఫార్మాట్‌లో ప్రస్తుతం టీమిండియా విజయవంతంగా కొనసాగుతోందని, ఇలాంటి సందర్భంలో మెంటర్‌ పోస్ట్‌ను ప్రత్యేకంగా సృష్టించి ధోనికి బాధ్యతలు అప్పజెప్పడంలో అర్ధం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్‌లో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటే మెంటర్‌ అవసరముండేదని, కానీ.. ప్రస్తుత పరస్థితుల్లో ధోని నియామకం హాస్యాస్పదమన్నాడు. 

కాగా, ధోని హయాంలో టీమిండియా కీలక మ్యాచ్​ల్లో ఒత్తిళ్లని, సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. బహుశా ఇదే కారణం చేత ధోని ఎంపిక జరిగి ఉండవచ్చు. ఏదిఏమైనా ఒత్తిడిని అధిగమించడంలో మాస్టర్‌ అయిన ధోని టీమిండియాతో పాటు ఉండడం సానుకూలాంశమే. ఇదిలా ఉంటే, టీమిండియా మెంటర్‌గా ధోని ఎంపికపై వివాదం నడుస్తోంది. లోధా క‌మిటీ సిఫార్సులకు విరుద్ధంగా ధోని నియామకం జరిగిందంటూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ స‌భ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.
చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..

మరిన్ని వార్తలు