హాట్సాఫ్‌: కోహ్లిపై గంభీర్‌ ప్రశంసలు

4 Dec, 2020 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఏ విషయంలోనైనా సరే.. మనం ఏం చేయాలని కోరుకుంటామో అదే చేస్తాం. నిజానికి, చివరి రన్‌ పూర్తి చేసి హోటల్‌ గదికి వచ్చిన తర్వాత.. దేశం కోసం నేను ఈమాత్రం చేయగలిగాను అనే సంతృప్తి లభిస్తుంది చూడండి.. నాకు తెలిసి అదే ప్రపంచంలో అన్నింటికంటే మనకు ఎక్కువ సంతోషాన్ని కలిగించే అనుభూతి. ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ఈరోజు తను ఈ స్థాయిలో ఉన్నాడు. అతడికి హ్యాట్సాఫ్‌. 20 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అందులో సెంచరీలు, అర్ధ సెంచరీలు ఎన్నో ఉన్నాయి’’ అంటూ మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. 

కాగా భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయినప్పటికీ వ్యక్తిగతంగా కోహ్లి అరుదైన రికార్డులు నెలకొల్పాడు. నవంబరు 29న సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన రెండో వన్డేలో 22 వేల పరుగుల(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి) మార్కుకు చేరుకున్న ఈ రన్‌మెషీన్‌.. గత దశాబ్ద కాలంగా 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. (చదవండి: ఏంటిది కోహ్లి.. ఇలా ముగించేశావు?  )

అదే విధంగా బుధవారం నాటి చివరి మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు. తద్వారా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను బద్దలుగొట్టాడు. దీంతో మాజీ క్రికెటర్లు కోహ్లి బ్యాటింగ్‌ తీరు, అతడి అంకిత భావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో గౌతీ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ విరాట్‌ కోహ్లి ప్రదర్శనపై పైవిధంగా స్పందించాడు. (చదవండి: 'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా')

మరిన్ని వార్తలు