T20 World Cup 2021: పాక్‌పై గెలుపు బాధ్యత ఆ ఇద్దరిదే: గంభీర్‌ 

16 Jul, 2021 20:50 IST|Sakshi

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌ డ్రా వెలువడిన నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యుర్ధులైన భారత్, పాక్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అయితే దాయాదుల మధ్య జరిగే ఈ పోరులో గెలుపు బాధ్యతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలే తీసుకోవాలని గంభీర్‌ వ్యాఖ్యానించారు. పాక్‌​తో పోరంటే ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం సహజమని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా సీనియర్లైన కోహ్లీ, రోహిత్ శర్మలు బాధ్యతగా ఆడాలని సూచించాడు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగిన తాను ఒత్తిడికిలోనైనట్లు చెప్పుకొచ్చాడు. రాబోయే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నాలాగే కొత్త కుర్రాళ్లు కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదమున్నందున సీనియర్లు కోహ్లీ, రోహిత్‌లు జాగ్రత్తగా ఆడాలని, గెలుపు బాధ్యతను వారి భుజాలపైనే వేసుకోవాలని పేర్కొన్నాడు. ఓ ప్రముఖ ఛానెల్‌లో జరిగిన స్పెషల్ షోలో గంభీర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే షోలో పాల్గొన్న భారత్ వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్‌ వేరని పేర్కొన్నాడు. దాయాదుల పోరంటేనే భావోద్వేగాల సమ్మేళనమని, ఇరు జట్లపై గెలుపు అంచనాలు సమానంగా ఉంటాయని వెల్లడించాడు.

ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తుందని, మాజీ క్రికెటర్లు సైతం పాక్‌తో మ్యాచ్ అంటే ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నాడు. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ20 ప్రపంచకప్‌ 2021 జరుగనుంది. దీనికి సంబంధించిన డ్రాను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాయి. గ్రూప్‌-1లో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు రెండు క్వాలిఫయర్స్‌ జట్లు పోటీపడనుండగా, గ్రూప్‌-2లో భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌తో పాటు మరో రెండు క్వాలిఫయర్స్‌ జట్లు తలపడనున్నాయి.

>
మరిన్ని వార్తలు