‘బౌలర్లు బలైపోతున్నారు.. రూల్స్‌ మార్చండి’

27 Mar, 2021 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారీ స్కోర్లు నమోదు కావడంపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మరొకసారి ధ్వజమెత్తాడు. క్రికెట్‌ అనేది కేవలం బ్యాట్స్‌మెన్‌ గేమ్‌లా మారిపోయిందని, ఇక్కడ బౌలర్లకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించాడు. ఇకనైనా రూల్స్‌ను పునః సమీక్షిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి క్రికెట్‌లోని నిబంధనలను మార్చాలని సూచించాడు. ప్రత్యేకంగా బ్యాట్స్‌మన్‌కు బౌలర్లకు సమతుల్యం దెబ్బ తినకుండా ప్రస్తుతం ఉన్న రూల్స్‌ను మారిస్తే మెరుగ్గా ఉంటుందన్నాడు. ఏ గేమ్‌ చూసినా బౌలర్లే బలైపోతున్నారని, రూల్స్‌ను పునః సమీక్షించాలని సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేశాడు గంభీర్‌. ఇక్కడ చదవండి: కోహ్లి... పూర్‌ కెప్టెన్సీ; ఇలా అయితే వరల్డ్ కప్‌లో..

దీన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సైతం సీరియస్‌గా తీసుకోవాలన్నాడు.  ‘ భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేను చూడండి.బౌలర్లు బలైపోయారు. అసలు బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా అర్థం కాలేదు. ఐసీసీ, బీసీసీఐలు దీనిపై దృష్టి సారించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలన్నీ బ్యాట్స్‌మెన్‌కే ఫేవర్‌గా ఉన్నాయనే విషయం మ్యాచ్‌ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమైపోతుంది. ప్రధానంగా సర్కిల్‌ రూల్‌, రెండు కొత్త బంతుల నిబంధన, బౌన్సర్‌ రూల్స్‌ను కచ్చితంగా మార్చాల్సిన అవసరం​ ఉంది. రూల్స్‌ను మారిస్తే కానీ బౌలర్లు ‘ప్రోగ్రామ్డ్‌ బౌలింగ్‌ మెషీన్లు’ గా కాకుండా  ఉంటారు. నిబంధనల వల్ల బౌలర్లకు పెద్దగా ప్రయోజనం ఏమీ చేకూరడం లేదని విషయాన్ని గవర్నింగ్‌ బాడీ పెద్దలు గ్రహించాలన్నాడు. కాగా, నిన్న జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేయగా,  ఆ స్కోరును ఇంగ్లండ్‌ 44.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదయ్యాయి. ఇక్కడ చదవండి: కోహ్లి ఏదో చెప్పబోయాడు.. అంపైర్‌ పట్టించుకుంటే కదా!

>
మరిన్ని వార్తలు