కొలంబో: కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) వచ్చే నెలలో ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లీగ్లో గేల్, డుప్లెసిస్లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్వైట్లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. (రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? )
ఆ లీగ్ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్పీఎల్ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్బాన్తోటలో లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం.(ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?)