Adam Gilchrist: బీసీసీఐకి లెజెండరీ వికెట్‌కీపర్‌ విజ్ఞప్తి

28 Jul, 2022 20:21 IST|Sakshi

భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్‌కీపర్‌, ఆసీస్‌ మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్‌ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్‌బాష్‌ లీగ్‌, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వంటి ఫారిన్‌ లీగ్స్‌లో పాల్గొనడం వల్ల ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. 

భారత క్రికెటర్లు  విదేశాల్లో (టీ20 లీగ్‌ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్‌ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్‌ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్‌ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్‌ ప్రపంచంలోనే టాప్‌ టీ20 లీగ్‌ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌పై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
చదవండి: బిగ్‌బాష్‌ లీగ్‌ లో ఆడనున్న భారత ఆల్‌ రౌండర్‌..!

మరిన్ని వార్తలు