పృథ్వీ షా స్థానంలో వచ్చాడు.. రికార్డు పట్టేశాడు

27 Dec, 2020 19:38 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. రెండో టెస్టులో ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసి ఆసీస్‌ను రెండొందల పరుగులు దాటకుండా మొదటి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసిన టీమిండియా.. ఆపై తన తొలి తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్యా రహానే అద్భుతమైన సెంచరీతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రహానేకు జతగా, రవీంద్ర జడేజా(40 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. (రెండు ఫార్మాట్లకు ధోనినే కెప్టెన్‌!)

కాగా,  ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న గిల్‌ 8 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఒక చెత్త బంతిని ఆడి చివరకు పెవిలియన్‌ చేరాడు. అయితే గిల్‌ ఖాతాలో ఓ రికార్డు చేరింది. ఆస్ట్రేలియాలో అరంగేట్రం టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో టీమిండియా క్రికెటర్‌గా గిల్‌ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ జాబితాలో తన సహచర ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తొలి స్థానంలో(పరుగులు పరంగా) ఉన్నాడు. 2018లో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసిన మయాంక్‌ 76 పరుగులు సాధించాడు. ఆ తర్వాత  స్థానంలో మాజీ క్రికెటర్‌ దత్తు ఫడ్కర్‌ ఉన్నారు. 1947లో ఆస్ట్రేలియలో టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన ఫడ్కకర్‌ 51 పరుగులు చేశాడు. 

పృథ్వీ షా స్థానంలో గిల్‌..
తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన మరో ఓపెనర్‌ పృథ్వీ షా స్థానంలో గిల్‌ను రెండో టెస్టు తుది జట్టులో తీసుకున్నారు.  పృథ్వీ షా వైఫల్యంతో గిల్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని గిల్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ డకౌట్‌గా వెనుదిరిగితే గిల్‌ మాత్రం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీకి దగ్గరగా వచ్చిన గిల్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. రెండో వికెట్‌కు పుజారాతో కలిసి 61 పరుగులు  గిల్‌ జత చేశాడు. (సెంచరీ‌తో మెరిసిన కెప్టెన్‌‌ అజింక్యా రహానే)

మరిన్ని వార్తలు