Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు'

25 Jan, 2023 09:38 IST|Sakshi

టీమిండియా యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు వన్డేల గ్యాప్‌లో ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు కొట్టి పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మరోసారి శతకంతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్ అవార్డును కొల్లగొట్టాడు. కివీస్‌తో మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ విజయం అనంతరం ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్న శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడాడు. ఈ సందర్భంలో వ్యాఖ్యాతా గిల్‌కు ఒక క్లిష్టమైన ప్రశ్న వేశాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. కింగ్‌ కోహ్లిలలో ఎవరిని సూపర్‌స్టార్‌గా ఏంచుకుంటావని ప్రశ్న వేశాడు. దీనిపై గిల్‌ స్పందిస్తూ.. ''ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఒకరిని గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పరిగణిస్తే.. మరొకరిని నా గురువుగా భావిస్తా. అలాంటిది ఇద్దరిలో ఎవరిని సూపర్‌స్టార్‌గా ఏంచుకుంటానని చెప్పడం కష్టమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్యా నా ఓటు కింగ్‌ విరాట్‌ కోహ్లికే.

దీనికి నా దగ్గర సమాధానం ఉంది. సచిన్‌ సార్‌ క్రికెట్‌లో ఉన్నప్పుడు ఆట గురించి పెద్దగా తెలియదు. మా నాన్న ఆయనకు పెద్ద అభిమాని. నాన్న నోటి నుంచే తొలిసారి సచిన్‌ అనే పేరు విన్నాను. అప్పటినుంచి క్రికెట్‌ను ప్రేమిస్తూ వచ్చాను. సచిన్‌ను క్రికెట్‌ దేవుడిగానే చూశాను. ఆయన రిటైరయ్యే సమయానికి ఇంకా నేను క్రికెట్‌ నేర్చుకునే దశలోనే ఉన్నాను. కానీ ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కోహ్లిని ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తున్నా. ఒక బ్యాటర్‌గా అతని నుంచి ఎన్నో విలువైన సలహాలు అందుకున్నా. కోహ్లి భయ్యాతో కలిసి బ్యాటింగ్‌ చేయడమే నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా'' అంటూ చెప్పాడు. ఇదంతా విన్న కోహ్లి.. గిల్‌ దగ్గరకి వచ్చి హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. 

ఇక శుబ్‌మన్‌ గిల్‌ మూడో వన్డేలో సెంచరీ చేయడంతో పలు రికార్డులు అందుకున్నాడు
► అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వన్డే సెంచరీలు (21) పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (9) అగ్రస్థానంలో ఉండగా.. క్వింటన్‌ డికాక్‌ (16), డెన్నిస్‌ అమిస్‌ (18), షిమ్రోన్‌ హెట్మేయర్‌ (22) 2, 3, 5 స్థానాల్లో నిలిచారు. 
► భారత్‌ తరఫున అతి తక్కువ వన్డేల్లో 4 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో ఈ రికార్డు శిఖర్‌ ధవన్‌ పేరిట ఉండేది. ధవన్‌ 24 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించగా.. గిల్‌ 21 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 
► ఇదే మ్యాచ్‌లో గిల్‌ మరో ప్రపంచ రికార్డును సమం చేశాడు. 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ సరసన నిలిచాడు. బాబర్‌ 2016 విండీస్‌ సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్‌ ప్రస్తుత న్యూజిలాండ్‌ సిరీస్‌లో అన్నే పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఇమ్రుల్‌ కయేస్‌ (349), డికాక్‌ (342), గప్తిల్‌ (330) ఉన్నారు. 

చదవండి: కుల్దీప్‌ చెవులు పిండిన చహల్‌.. బెదిరించిన సిరాజ్‌

మరిన్ని వార్తలు