అడవి నుంచి హాకీ ఆటకు..

5 Oct, 2020 09:35 IST|Sakshi

జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికైన ఛత్తీస్‌ గిరిజన బాలికలు

రాయ్‌పూర్‌/న్యూఢిల్లీ: ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలో కనీస వసతులు కూడా లేని చోట హాకీలో శిక్షణ పొందిన 9 మంది గిరిజన బాలికలు జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. 14– 17 ఏళ్ల వయసున్న ఈ బాలికలకు ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ జిల్లాలో ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది నాలుగేళ్ల క్రితం నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అక్కడ మైదానం లేకపోవడంతో ఓ హెలిప్యాడ్‌ స్థలంలోనే గిరిజన బాలికలు హాకీలో శిక్షణ పొందారు. ఆటలో రాటుదేలారు. వీరిలో 9 మంది సబ్‌–జూనియర్, జూనియర్‌ జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారని ఐటీబీపీ అధికారులు తెలిపారు. మంచి వసతులు కల్పించి, సరైన శిక్షణ ఇస్తే గిరిజన బాలికలు సైతం అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు.

‘‘హాకీ మన జాతీయ క్రీడ అని పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే, 2016 దాకా ఆ ఆట గురించి మాకేమీ తెలియదు. ఐటీబీపీ అధికారులు చెప్పిన తర్వాతే తెలుసుకున్నాం. ఇది మొత్తం అటవీ ప్రాంతం. మైదానం లేకపోవడంతో మర్దపాల్‌ పోలీసు క్యాంప్‌ సమీపంలోని హెలిప్యాడ్‌లో ప్రాక్టీస్‌ చేశాం. మైదానం ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కోరుతున్నాం’’అని సులోచనా నేతం అనే బాలిక పేర్కొన్నారు. (రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..)

మరిన్ని వార్తలు