ప్రజ్నేశ్‌ శుభారంభం 

22 Sep, 2020 03:06 IST|Sakshi

సుమీత్, రామ్‌కుమార్‌ ఓటమి

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేయగా... భారత నంబర్‌వన్‌ సుమీత్‌ నాగల్, రామ్‌కుమార్‌ రామనాథన్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. 29వ సీడ్‌ ప్రజ్నేశ్‌ 6–3, 6–1తో సిమ్‌ ఇల్కెల్‌ (టర్కీ)పై గెలుపొందగా... 16వ సీడ్‌ సుమీత్‌ నాగల్‌ 6–7 (4/7), 5–7తో డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ) చేతిలో... రామ్‌కుమార్‌ 5–7, 2–6తో లమసినె (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇల్కెల్‌తో 65 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ప్రజ్నేశ్‌ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. రెండో రౌండ్‌లో అలెగ్జాండర్‌ వుకిచ్‌ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ అంకితా రైనా బరిలో ఉంది. నేడు జరిగే తొలి రౌండ్‌లో ఆమె జొవానా జోవిచ్‌ (సెర్బియా)తో తలపడుతుంది. 

మరిన్ని వార్తలు