IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

25 Nov, 2022 12:49 IST|Sakshi
ఫైల్‌ ఫోటో(ముంబై ఇండియన్స్‌)

ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా అర్చర్‌ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తొలి సారిగా అర్చర్‌ బౌలింగ్‌ చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌కు అర్చర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

టెలిగ్రాఫ్‌ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్‌ వేసిన అర్చర్‌ వికెట్లు ఏమీ సాధించకుండా 38 పరుగులు ఇచ్చాడు. అయితే తన పేస్‌ బౌలింగ్‌తో మాత్రం ఇంగ్లండ్‌ ఓపెనర్‌ను జాక్‌ క్రాలీ ముప్పు తిప్పలు పెట్టాడు. కాగా 2021లో అర్చర్‌ మోచేయికి గాయమైంది. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది.  ఇక డిసెంబర్‌1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్‌
ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అర్చర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అర్చర్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై తరపున ఆడనున్నాడు. అంతకన్నా ముందు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌ టౌన్‌ తరపున అర్చర్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా ముంబై కేప్‌ టౌన్‌ జట్టును కూడా ముంబై ఇండియన్స్‌ యాజమాన్యమే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు