కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్‌

29 May, 2022 17:58 IST|Sakshi

బాక్సింగ్‌ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బ్రూక్లిన్‌ వేదికగా బార్క్‌లేస్‌ సెంటర్‌లో గెర్వొంటా డేవిస్‌, రొనాల్డో రొమేరో మధ్య బాక్సింగ్‌ ఫైట్‌ జరిగింది. పోరు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది.


దీంతో ఎరీనాలోకి అగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడేమోనని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. కాల్పులు జరిగింది బార్క్‌లే సెంటర్‌లో కాదని.. బయట జరిగాయని తేలింది. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు శాంతించడంతో కాసేపట్లోనే పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది.

కాగా అదే బార్క్‌లే సెంటర్‌కు జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నయామి ఒసాకా కూడా వచ్చింది. అక్కడ జరిగిన అనుభవాన్ని ఒసాకా తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. ''నేనప్పుడే బార్క్‌లే సెంటర్‌లోనికి వచ్చాను. అప్పుడే సడెన్‌గా నాకు కాల్పుల శబ్దం వినిపించడం.. ప్రాణభయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో  నాకు భయమేసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లిపోయి డోర్స్‌ క్లోజ్‌ చేసుకున్నాం. ఆ క్షణంలో మాకు ప్రాణం మీద ఆశ కలిగింది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అనుకుంటా'' అంటూ పేర్కొంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే గెర్వొంటో డేవిస్‌.. రొనాల్డో రెమోరోపై నాకౌట్‌ విజయం సాధించాడు.

చదవండి: Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!

మరిన్ని వార్తలు